Saturday 16 November 2013

టెండూల్కర్‌కు భారతరత్న: రాష్ట్రపతి ఆఫీస్ ప్రకటన

న్యూఢిల్లీ: క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను భారత అత్యున్నత పౌర పురస్కారం వరించింది. సచిన్ టెండూల్కర్‌కు అత్యున్నత పురస్కారం భారతరత్నను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన ఓ ప్రకటన శనివారం రాష్ట్రపతి కార్యాలయం నుంచి వెలువడింది. క్రికెట్‌లో ఎన్నో రికార్డులను తనపేరున లిఖించుకున్న మాస్టర్ సచిన్ టెండూల్కర్ భారత దేశానికి చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ముంబైలోని వాంఖేడే స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన తన 200వ టెస్టు మ్యాచ్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు స్వస్తి పలికిన అనంతరం కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారత అత్యున్నత పౌర పురస్కారం పొందిన తొలి క్రీడాకారుడిగా సచిన్ టెండూల్కర్ చరిత్ర సృష్టించారు. 
టెండూల్కర్‌కు భారతరత్న: రాష్ట్రపతి ఆఫీస్ ప్రకటన

తల్లికి అంకితమిస్తున్నా: సచిన్ భారత రత్న రావడం ఆనందంగా ఉందని సచిన్ టెండూల్కర్ అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురస్కారాన్ని తన తల్లి రజనికి అంకితం ఇస్తున్నట్లు సచిన్ ప్రకటించారు. భారతరత్న అవార్డు అందుకున్న అతి పిన్న వయస్కుడిగా సచిన్ టెండూల్కర్ రికార్డు సృష్టించారు. 24ఏళ్ళుగా భారత్‌కు క్రికెట్ ఆడుతూ విశేష సేవలందించిన సచిన్ టెండూల్కర్‌కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాస్టర్ సచిన్ టెండూల్కర్‌తోపాటు ప్రముఖ శాస్త్రవేత్త, ప్రధాని సాంకేతిక సలహాదారు అయిన ప్రొఫెసర్ సీఎన్ రావుకు కూడా కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది.

0 comments:

Post a Comment